పీలేరు, ఆగస్టు 15(జానం న్యూస్): పీలేరు డివిజన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె.ఆర్ ఆనందబాబు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా తన ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రం అందుకున్నారు. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రమైన రాయచోటి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు వైభవంగా జరిగాయి. అందులో భాగంగా ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖలకు చెందిన అధికారులకు ఉత్తమ ప్రశంసా పత్రాలు అందజేశారు. అందులో భాగంగా పీలేరు డివిజన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె.ఆర్ ఆనందబాబు ఉత్తమ ప్రశంస పత్రం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష పి.ఎస్ సమక్షంలో అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. పీలేరు డివిజన్లో ఆయన అసంఘటిత కార్మికులకు ఎనలేని సేవ చేశారు. పీలేరు డివిజన్ లో భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు అత్యధికంగా అందజేసి పీలేరు డివిజన్ ను ఉమ్మడి చిత్తూరు జిల్లా లోనే మూడవ స్థానంలో నిలిపారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందజేయడంలో తీవ్రంగా కృషి చేసారు. అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ ఇన్సూరెన్స్ కార్డులు అందజేయడంలో డివిజన్లో 75% పూర్తి చేశారు. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా పోలీసు శాఖతో కలిసి బాల కార్మికుల నిర్మూలన కొరకు ఎనలేని కృషి చేశారు. డిస్టిక్ లీగల్ అథారిటీ కార్యదర్శి కరుణ కుమార్ ఆదేశాల మేరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పాటుపడ్డారు. పీలేరు, కె.వి పల్లి, చిన్నగొట్టిగల్లు, రొంపిచర్ల, సదుము తదితర ఐదు మండలాలలో ఇటుక బట్టీలలో పనిచేస్తున్న బీహార్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన బాల కార్మికులకు విముక్తి కలిగించారు.
ఈ సందర్భంగా కె.ఆర్ ఆనందబాబు మాట్లాడుతూ తన ఉత్తమ సేవలను గుర్తించి ప్రశంసా పత్రం అందజేసినందుకు తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. అసంఘటిత కార్మికుల అభివృద్ధికి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

