జానం న్యూస్, (పీలేరు), జూలై 22:
తహసిల్దార్ మహబూబ్ బాషా సేవలు మరువరానివని పీలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ మల్లెల, సీనియర్ పాత్రికేయులు జాకీర్ పఠాన్ అన్నారు.సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అనంతపురం జిల్లా నుండి పీలేరు తహసీల్దార్గా నియమితులైన మహబూబ్ బాషా తిరిగి సొంత జిల్లాకు బదిలీ కావడంతో సోమవారం విధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన సేవలను పురస్కరించుకుని పీలేరు ప్రెస్ క్లబ్ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పీలేరు ప్రెస్ క్లబ్ నాయకులు తహసీల్దార్ మహబూబ్ బాషా కు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. కేక్ను కట్ చేసి అక్కడున్న వారందరికీ పంచిపెట్టి సంబరాలను మరింత పెంచారు.
ఈ సందర్భంగా పీలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ మల్లెల, సీనియర్ పాత్రికేయులు జాకీర్ పఠాన్ మాట్లాడుతూ తహసీల్దార్ గా మహబూబ్ బాషా సమర్థవంతంగా, నిజాయితీగా పని చేశారని కొనియాడారు. క్లిష్ట సమయంలో ఆయన నియమితులై నిష్పక్షపాతంగా, సమర్ధవంతంగా ఎన్నికల విధులు నిర్వర్తించారని గుర్తు చేశారు. ప్రభుత్వ భూములను భూకబ్జాదారుల నుంచి కాపాడేందుకు మహబూబ్ బాషా తీసుకున్న చర్యలను జాకీర్ కొనియాడారు. పీలేరు ప్రాంతంలో భూ సమస్యలు పరిష్కరించడంలో ఆయన అంకితభావంతో పనిచేశారని అన్నారు.తహసిల్దార్ మహబూబ్ బాషా మీడియా ప్రతినిధుల పట్ల చూపిన స్నేహపూర్వక ప్రవర్తన మరియు ఆయన ఇచ్చిన సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ నాయకులు ఖాదర్ భాషా, జానం గంగిరెడ్డి, షేక్ మస్తాన్ సాహెబ్, నంద్యాల నాగరాజు, రవికిషోర్, తులసీకృష్ణ, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
https://youtu.be/_GFoxmMfKw0?si=TVkTQl1-wxpkxNF5

Save or share this story as a newspaper-style Epaper Clip:

