మెగా పీటీఎం–4.0 విజయవంతం.. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయుల చేయూత
కలికిరి, జూలై 24(జానం న్యూస్): కలికిరి ఇందిరమ్మ కాలనీలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం-4.0) విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, అభ్యాస ఫలితాలు, పాఠశాల అభివృద్ధి, తల్లిదండ్రుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు.
పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు తమ వంతు సహకారాన్ని అందించారు. అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు వి.గంగరాజు ₹5 వేల నగదు విరాళాన్ని, ఎన్. మధుసూదన్ రెడ్డి ₹2 వేల నగదు విరాళాన్ని అందజేశారు. పి. ఖాదరవల్లి ₹1,000 విలువైన క్రీడా సామగ్రి, నోట్బుక్స్, స్టేషనరీ వస్తువులను పాఠశాలకు అందించారు. వారి సేవాభావాన్ని ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మెగా పీటీఎం ద్వారా తల్లిదండ్రులు పిల్లల విద్యా ప్రగతిని ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. పాఠశాల అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా విరాళాలు అందించిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.
ముఖ్య అతిథులుగా హాజరైన ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ప్రకాష్, విశ్రాంత ఉపాధ్యాయులు రమేష్ బాబు, స్థానిక నాయకుడు అగస్తీశ్వర మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం కార్యక్రమం విద్యార్థుల విద్యా నాణ్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ వహిస్తూ పాఠశాల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా అందించిన విరాళాలు ఇతరులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
అనంతరం తల్లిదండ్రులతో విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, అభ్యాస సామర్థ్యాలపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా చర్చించి, మెరుగైన ఫలితాల సాధనకు అవసరమైన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షబానా, సుజాత, లక్ష్మీదేవి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

