కలికిరి, మార్చి 15(జానం న్యూస్):రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణానికి చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు జానం సుజాత ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు

గత 17 సంవత్సరాలుగా నిరంతరం పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి అవసరమైన పరీక్షా సామగ్రిని అందించడం, పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా ప్రోత్సహించడం ఆమె ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం పరీక్షల ముందు రోజు విద్యార్థులను కలుసుకుని వారికి అవసరమైన సూచనలు ఇవ్వడం ద్వారా వారి మనోధైర్యాన్ని పెంచుతున్నారు.

ఈ సందర్భంగా కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (టి.చదివేవాండ్లపల్లి)లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన సామగ్రిని ఉచితంగా అందజేశారు. విద్యార్థులకు పెన్, పెన్సిల్, ఎరైజర్, పెన్సిల్ షార్పెనర్ వంటి అవసరమైన వస్తువులతో పాటు హాల్ టికెట్ను సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రత్యేకంగా హాల్ టికెట్ కవర్లు కూడా అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జానం సుజాత, విద్యార్థులు పబ్లిక్ పరీక్షలను భయపడకుండా ఆత్మవిశ్వాసంతో, సమయపాలనతో రాయాలని సూచించారు. ప్రశ్నాపత్రాన్ని ముందుగా జాగ్రత్తగా చదివి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. అలాగే సమాధానాలను స్పష్టంగా, శుభ్రంగా, క్రమపద్ధతిలో రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని వివరించారు.

పరీక్షా హాల్లో పాటించాల్సిన నియమాలు, జాగ్రత్తల గురించి కూడా విద్యార్థులకు వివరించారు. పరీక్షకు వెళ్లే ముందు అవసరమైన అన్ని సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని సూచించారు. పరీక్షల సమయంలో ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ప్రశ్నలకు సమాధానాలు రాయాలని విద్యార్థులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పరీక్షల పట్ల నమ్మకం, ధైర్యాన్ని పెంచిందని విద్యార్థులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ సేవ చేస్తున్న జానం సుజాతను విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.

