కలికిరి, మార్చి 7(జానం న్యూస్):
కలికిరి మండలంలోని ఇందిరమ్మకాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. టిడిపి పీలేరు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కె.అగస్తీశ్వర్ మరియు ఆయన సతీమణి కె. మంగమ్మ దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో ఇదే పాఠశాలలో తెలుగు అధ్యాపకురాలిగా సేవలందించిన కె. మంగమ్మ ప్రస్తుతం వాల్మీకిపురం పీసీసీ హైస్కూల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఉత్సాహం కలిగించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు రూ.7,000 విలువైన ప్యాడ్లు, జ్యామెట్రీ బాక్సులు, పెన్నులు వంటి విద్యా సామగ్రిని విద్యార్థులకు అందజేశారు. పరీక్షలకు వెళ్లే సమయంలో అవసరమైన వస్తువులు కొత్తగా ఉండటం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతుందని భావించి ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు దంపతులు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులందరూ కష్టపడి చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. హైస్కూల్ అనంతరం ఉన్నత విద్యను అభ్యసించే దశలో ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్యను పొందాలని సూచించారు. గురువులను గౌరవించడం, సమాజంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ప్రతి విద్యార్థి లక్ష్యంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు.విద్యార్థులు ఈ ప్రోత్సాహకానికి ఆనందం వ్యక్తం చేస్తూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాలప్రధానోపాధ్యాయుడు రమేష్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

