‘ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్-2026’లో భాగంగా కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం సందర్శించిన ఇందిరమ్మ కాలని ZPHS (T.చదివేవాండ్లపల్లి ) విద్యార్థులు
కలికిరి, జూన్ 29 (జానం న్యూస్): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్-2026’ కార్యక్రమంలో భాగంగా కలికిరి ఇందిరమ్మ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (టి. చదివేవాండ్లపల్లి) 9వ తరగతి విద్యార్థులు కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)ను సందర్శించారు. విద్యార్థుల్లో సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి వనరుల సంరక్షణపై అవగాహన పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ కె. మంజుల మాట్లాడుతూ, రైతులు, మహిళలు, గ్రామీణ యువత కోసం కేవీకే ద్వారా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతులను అవలంబించడం ద్వారా నేల సారాన్ని కాపాడటంతో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. వానపాముల ఎరువు (వర్మీ కంపోస్ట్) తయారీ విధానం, అందులోని స్థూల, సూక్ష్మ పోషకాల ప్రాధాన్యం, వివిధ పంటల్లో వాటి వినియోగంపై సమగ్రంగా అవగాహన కల్పించారు.

వరి సాగులో పశువుల ఎరువు, అజోస్పిరిల్లం, పీఎస్బీ, కేఎస్బీ వంటి జీవన ఎరువులను వినియోగించడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించిన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. సేంద్రియ సాగు విధానాలను రైతులకు చేరవేసేందుకు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిరంతరం శిక్షణా శిబిరాలు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం విద్యార్థులు కేవీకేలోని వర్మీ కంపోస్ట్ యూనిట్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, షేడ్ నెట్ హౌస్, అజోల్లా యూనిట్, కస్టమ్ హైరింగ్ సెంటర్, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను సందర్శించారు. ఆయా విభాగాల పనితీరు, రైతులకు అందిస్తున్న సాంకేతిక సేవలు, మట్టి పరీక్షల ప్రాముఖ్యత, సమీకృత వ్యవసాయ విధానాల ప్రయోజనాలపై శాస్త్రవేత్తలు విద్యార్థులకు వివరించారు. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం లభించడం విద్యార్థుల్లో విశేష ఆసక్తిని కలిగించింది.

గైడ్ టీచర్ జానం సుజాత మాట్లాడుతూ, విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వనరుల సంరక్షణపై చైతన్యం పెంపొందించడం, భవిష్యత్లో పర్యావరణహిత జీవనశైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులు డాక్టర్ కె. మాధురి, డాక్టర్ వై. పీరుసాహెబ్, ఎస్. సోమశేఖర్ బాబు, సి. శరత్ కుమార్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ రమణ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip:

