రాయచోటి ఆగస్టు 17(జానం న్యూస్); టి. సుండుపల్లి మండలం, అగ్రహారం గుట్ట సర్వే నెంబర్ 2141 లో పేద వారి ఇండ్ల కు టి.సుండుపల్లి మండల రెవెన్యూ అధికారులు నోటీసు అంటించడoపై మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు బండి ఈశ్వర్ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్బంగా బండి ఈశ్వర్ మాట్లాడుతూ క్రమ నిర్మాణ భవనాలను వదిలి పేదల ఇల్లకు నోటీసులు అంటించడం అన్యాయమని అన్నారు. అన్ని ఆధారాలు ఉండి, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూలి చేసుకుని బ్రతుకుతున్న ఎస్సీ/ఎస్సీ/బి.సి, మైనారిటీ పేదలు ఇండ్లకు చట్ట విరుద్ధంగా రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించడం దారుణం అని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి సంబంధిత ఇండ్లలో జీవిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఇప్పుడు నోటీసు అంటించాల్సిన అవసరం ఏమని ప్రశ్నించారు? అధికారులు ఇలా చేయడం వల్ల ప్రాథమిక పౌరహక్కులకు భంగం కలిగించి నట్లే నని బండి ఈశ్వర్ అన్నారు. కొంతమంది భూ బకాసురుల ఒత్తిడితో రెవెన్యూ అధికారులు అక్కడ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయింది అని నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు.అలానే మండల కేంద్రం లో భూ దాహంతో కొంతమంది బడా నాయకులు ప్రభుత్వ స్థలం కబ్జా చేసి ఇండ్లు నిర్మించడమే కాకుండా పక్క సర్వే నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు జరిపి కోట్లు సంపాదించారు. అలాంటి వారికి కొమ్ము కాస్తూ పేదవారి పూరి గుడిసెలకు కూడా నోటీసులు ఇవ్వడం అధికారుల అవినీతికి అద్దం పడుతుంది అని అన్నారు. అధికారులు రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ పేదల కడుపులు కొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాదితులు జి.సుబ్బమ్మ, కోనేటి పద్మావతి, పి.వెంకటేష్, డి.సంపూర్ణమ్మ, హరి, కుళ్లాయప్ప, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

