సెబ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ
జానం న్యూస్, పీలేరు, జనవరి 2: పీలేరు కు చెందిన ఎం.రవి ప్రకాష్ డిఐజి ఆఫ్ పోలీస్ నుండి ఐజీ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందారు. జనవరి ఒకటో తేదీ ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.1998 సంవత్సరంలో ఏపిపిఎస్సి ద్వారా ఉత్తీర్ణుడై డీఎస్పీగా తెలంగాణ ప్రాంతంలోని పెద్దపల్లిలో నియమింపబడ్డాడు. నక్సలైట్లు అధికంగా ఉండే తెలంగాణ ప్రాంతంలో కూడా విధులు సమర్థవంతంగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ జిల్లా ల్లో డిఎస్పి, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ, డీఐజీగా సమర్థవంతంగా విధులు నిర్వహించి అధికారుల నుండి ప్రజల నుండి మన్ననలు అందుకున్నారు.2016 సంవత్సరంలో కాకినాడ జిల్లా, తుని రైలు దహనం ఘటనలో వేలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడుటలో ప్రధాన పాత్ర పోషించారు. వీరి సమర్థతకు గుర్తింపుగా ప్రభుత్వం సీఎం గాలంట్రి మెడల్, ప్రెసిడెంట్ మెడల్ బహుకరించడం జరిగింది. ఐజి గా పదోన్నత పొందిన తర్వాత సెబ్ కమిషనర్ గా ప్రభుత్వం ఆయనకు బాధ్యతలు అప్పగిచ్చింది. గతంలో రవి ప్రకాష్ డిఐజి హోదాలో సెబ్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు గంజాయి అక్రమ రవాణా లాంటి అసాంఘిక కార్యక్రమాలను ఉక్కుపాదంతో అణచివేశారు.ప్రభుత్వం డీఐజీ నుండి ఐజీ గా పదోన్నతి కల్పించిన నేపథ్యంలో రవి ప్రకాష్ కు సెబ్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెబ్ సిబ్బంది మరింత బాధ్యతగా పనిచేయాలని, విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రవి ప్రకాష్ స్వస్థలం పీలేరు మండలం, వేపులబైలు పంచాయితీ, బండమీదపల్లి. రవి ప్రకాష్ తండ్రి విశ్రాంతి డిఎస్పి ఎం.రామచంద్రయ్య అయ్యప్పరెడ్డి కాలనీ, పీలేరు లో నివాసం ఉంటున్నారు. సోదరుడు ఎం.కిరణ్ కుమార్ గూడూరు ఆర్డీవో గా విధులు నిర్వహిస్తున్నాడు. కిరణ్ కుమార్ పేరు గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిశీలనలో ఉంది.
Save or share this story as a newspaper-style Epaper Clip:

