కోటపల్లి సనోంద్ర రెడ్డి ఉదారత.. ఆలయ పునర్నిర్మాణానికి రూ.20 లక్షలు
వాల్మీకిపురం, జూన్ 22(జానం న్యూస్):
అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలంలోని చింతపర్తి గ్రామంలో వెలసి ఉన్న గ్రామదేవత శ్రీ గుంటి గంగమ్మ తల్లి దేవస్థాన పునర్నిర్మాణ కార్యక్రమానికి గ్రామానికి చెందిన దాత కోటపల్లి సనోంద్ర కుమార్ రెడ్డి రూ.20 లక్షల విరాళాన్ని అందజేశారు. ఆలయ అభివృద్ధి, పునరుద్ధరణ కార్యక్రమాలకు చేయూతగా ఈ విరాళాన్ని చెక్ రూపంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మంజుల చేతులకు గ్రామస్తుల సమక్షంలో అందించారు.
ఇటీవల శ్రీ గుంటి గంగమ్మ తల్లి దేవస్థానం పునర్నిర్మాణ పనుల కోసం స్థానిక శాసనసభ్యుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.1 కోటి సీఎంజీఎఫ్ (CGF) నిధులను మంజూరు చేయించారు. ఈ నిధుల వినియోగానికి అవసరమైన 20 శాతం ప్రజా భాగస్వామ్య నిధి (కాంట్రిబ్యూషన్)గా చెల్లించాల్సిన రూ.20 లక్షలను దాత కోటపల్లి సనోంద్ర కుమార్ రెడ్డి స్వచ్ఛందంగా అందించడం విశేషం.
ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్థులు, భక్తులు, ఇతర దాతలు కూడా ముందుకు రావడం హర్షణీయమని నిర్వాహకులు తెలిపారు. గ్రామ దేవతగా భక్తుల విశ్వాసాన్ని చూరగొన్న శ్రీ గుంటి గంగమ్మ తల్లి ఆలయాన్ని ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించడం అత్యంత అవసరమని ఓబులేశ్వర స్వామి దేవస్థానం అర్చకుడు విద్యాసాగర్ స్వామి పేర్కొన్నారు. ఆలయం పునర్నిర్మాణం పూర్తయితే భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన వాతావరణం కల్పించడంతో పాటు గ్రామ ఆధ్యాత్మిక వైభవం మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దాత కోటపల్లి సనోంద్ర కుమార్ రెడ్డి అందించిన ఈ ఉదార విరాళాన్ని గ్రామ పెద్దలు, భక్తులు, ఆలయ నిర్వాహకులు ప్రశంసించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం దాతను ఘనంగా సన్మానించి, దేవస్థాన అభివృద్ధికి విశేష సహకారం అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఓబులేశ్వర స్వామి దేవస్థానం అర్చకుడు విద్యాసాగర్ స్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి, నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ శేషాద్రి రెడ్డి, ద్వారకనాథ రెడ్డి, కె.వి. రెడ్డి, కాంతరాజు, రమేష్ బాబు, గుంటి గంగమ్మ తల్లి ఆలయ అర్చకులు వెంకటరమణ, పవన్ కుమార్ తదితర ప్రముఖులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి మంజుల వెల్లడించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

