కష్టకాలంలో తోడుగా నిలిచిన కువైట్ టీడీపీ నాయకులు
కువైట్, జూన్ 20(జానం న్యూస్):
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాతృమూర్తి నారా భువనేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకుని కువైట్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కష్టకాలంలో ఉన్న టీడీపీ కార్యకర్తకు సుగవాసి యువసేన, ఏపీ టీడీపీ యూత్ కువైట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆమె సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని కువైట్లోని హవల్లీ ప్రాంతంలో ఉన్న ప్రవాస తెలుగు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇటీవల కువైట్లో ఉద్యోగం నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ చేతికి తీవ్ర గాయమై, ఉద్యోగానికి దూరమై ఇంటికే పరిమితమైన టీడీపీ కార్యకర్త సుధాకర్ ఆచారి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సుగవాసి యువసేన, ఏపీ టీడీపీ కువైట్ నాయకులు ఆయనకు అండగా నిలవాలని నిర్ణయించారు.
సుగవాసి యువసేన అధ్యక్షుడు, ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడు కంచన రెడ్డిశేఖర్, ఏపీ టీడీపీ కువైట్ అధ్యక్షుడు, ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడు పఠాన్ ఖాదర్ ఖాన్ నాయకత్వంలో, సుగవాసి సాయి కిరణ్, పద్మరాజు వేణురాజు, మనుబోతు సహదేవ్, ఆవుల నాగేంద్ర, పగడాల సుగుణ, కొండా మర్రి శ్రీహరి నాయుడు (పాలాయెకిరి టీడీపీ కువైట్ అధ్యక్షుడు) తదితరుల ఆర్థిక సహకారంతో మొత్తం 91 కువైట్ దినార్లు (సుమారు ₹30,000) సేకరించి సుధాకర్ ఆచారికి అందజేశారు.
పెద్దలు ఖదురున్ సమక్షంలో జిలాన్ భాషా, అనీఫ్, చంద్రన్నతో పాటు గ్రూప్ సభ్యులు సుధాకర్ ఆచారి నివాసానికి వెళ్లి ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకుని తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నారా భువనేశ్వరి చేపడుతున్న సేవా కార్యక్రమాలు తమకు స్ఫూర్తినిచ్చాయని, భవిష్యత్తులో కూడా అవసరంలో ఉన్న తెలుగు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఉన్నప్పటికీ స్వదేశంతో అనుబంధాన్ని కొనసాగిస్తూ, అవసరమైన సమయంలో తోటి తెలుగు వారిని ఆదుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. నారా భువనేశ్వరి జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం ఆమె సేవా భావానికి నిజమైన నివాళిగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

