వాల్మీకిపురం, జూన్ 4(జానం న్యూస్):
తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవిందో కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో గురువారం వాల్మీకిపురంలోని నారాయణ సేవ అన్నదాన భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని నారాయణ సేవ అన్నదాన ట్రస్టు కార్యదర్శి చింతల శివానందరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, కంటి సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా మానవత సంస్థ చైర్మన్ జామకాయల కృష్ణమూర్తి మాట్లాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆరోగ్య శిబిరాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్సలు అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని పేర్కొన్నారు. సేవా దృక్పథంతో ముందుకు వస్తున్న వైద్య సంస్థలు, సేవా సంస్థలను ప్రజలు ప్రోత్సహించాలని కోరారు.

ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి మొత్తం 161 మంది రోగులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 42 మందిని కంటి శస్త్రచికిత్సల కోసం వైద్యులు ఎంపిక చేశారు. ఎంపికైన వారికి తిరుపతిలోని అరవిందో కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో అరవిందో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ రుషిక, పీఆర్ఓ గౌరీశంకర్, బాలాజీ, ట్రస్టు సభ్యులు చింతల వివేకానందరెడ్డి, బిడ్డల కేశవరెడ్డి, రేగంటి కుమార్, నీళ్ళ భాస్కర్, కువైట్ శంకరాచారి, గాంధీపేట రఘు, ఎక్స్ మిలిటరీ సత్య తదితరులు పాల్గొన్నారు. శిబిరం విజయవంతం కావడంలో సహకరించిన వైద్య సిబ్బంది, సేవా కార్యకర్తలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
i

Save or share this story as a newspaper-style Epaper Clip:

