తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ యర్రదొడ్డి సుభాషిని , తాను పదవ తరగతి పూర్తి చేసిన పీలేరు పట్టణంలోని అయ్యప్ప రెడ్డి కాలనీ, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల కోసం ఒక ప్రత్యేక బహుమతిని ప్రకటించారు.
పీలేరు, ఏప్రిల్ 17 (జానం న్యూస్):
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ యర్రదొడ్డి సుభాషిని రెడ్డి, తాను పదవ తరగతి పూర్తి చేసిన పీలేరు పట్టణంలోని అయ్యప్ప రెడ్డి కాలనీ, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల కోసం ఒక ప్రత్యేక బహుమతిని ప్రకటించారు.

తన తల్లిదండ్రులు యర్రదొడ్డి చందన, కృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థంగా, ప్రతి సంవత్సరం తెలుగు సబ్జెక్టులో ప్రథమ స్థానం సాధించే పదవ తరగతి విద్యార్థినికి బంగారు పతకాన్ని అందజేయాలని ఆమె నిర్ణయించారు.
ఈ క్రమంలో, 2023–24 విద్యా సంవత్సరంలో తెలుగు సబ్జెక్టులో అత్యధికంగా 99% మార్కులు సాధించిన పి. నందినికి గురువారం పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ సుభాషిని రెడ్డి స్వయంగా బంగారు పతకం మరియు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుభాషిని రెడ్డి మాట్లాడుతూ,”నేను చదువుకున్న ఈ పాఠశాల నా జీవితంలోని మధురమైన జ్ఞాపకం. నేను ఎంఏలో ప్రథమ స్థానం సాధించినప్పుడు ఈనాడు బంగారు పతకాన్ని అందుకున్నాను. ఆ స్ఫూర్తితోనే నా పూర్వ పాఠశాలకు ఏదో ఒక మంచి గుర్తుండిపోయే పని చేయాలనే సంకల్పం తో ఈ బహుమతి ఏర్పాటు చేశాను. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం తెలుగు సబ్జెక్టులో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థినికి బంగారు పతకం అందజేస్తాను,” అని అన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫౌజియా బేగం మాట్లాడుతూ,
“మా పాఠశాల పూర్వ విద్యార్థిని డాక్టర్ సుభాషిని రెడ్డి ఇలా మా విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగస్వామ్యమవుతుండటం చాలా గర్వకారణం. ఆమె చేసిన ఈ మంచి పని రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ హెచ్.ఎం. జానం సుజాత, తెలుగు ఉపాధ్యాయులు గంగయ్య, బోధనా సిబ్బంది శ్రీకళ, ఉమా మహేశ్వరి, రెడ్డి దీపారాణి, ఇంద్రాణి, ప్రసన్నలక్ష్మి, రాధారాణి, శైలజ, వ్యాయామ ఉపాధ్యాయులు సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

