కలికిరి, ఏప్రిల్ 5 :
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) కలికిరిలో శుక్రవారం రాత్రి జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలని, తమ విజయ పథాన్ని నిబద్ధత, నిజాయితీ, స్పష్టమైన దృష్టి, ఉన్నత ఆశయాలతో నిర్మించుకోవాలని JNTUA వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, “విద్యార్థుల విజయానికి క్రమశిక్షణ, సమర్థత, మరియు లక్ష్య నిర్దేశం అత్యంత కీలకమైనవి. బి.టెక్ నాలుగేళ్ల విద్యా కాలంలో విశ్వవిద్యాలయం అందిస్తున్న ఆధునిక సౌకర్యాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలి” అని సూచించారు.
విద్యార్థుల విజయాల్లో భాగస్వామ్యం కావడానికి కళాశాల పూర్వ విద్యార్థులు కూడా సహకరించాలని కోరారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కష్టాలను గుర్తు పెట్టుకుని, తాము చదువులో ఉన్నత స్థాయిలో నిలవాలని హితవు పలికారు.

JNTU కలికిరి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థులు, అధ్యాపకుల అవసరాలకు వైస్ ఛాన్సలర్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. గత రెండు సంవత్సరాల్లో కళాశాల స్వయం ప్రతిపత్తి హోదా (Autonomous Status), న్యాక్-A గుర్తింపు పొందిందని, కోర్సు స్ట్రక్చర్ రూపకల్పన, ఫలితాల ప్రాసెసింగ్ వంటి కీలక విభాగాల్లో పురోగతి సాధించామని తెలిపారు.
ఈ సంవత్సరం సుమారు 70 శాతం విద్యార్థులు 7 సీజీపీఏకు పైగా సాధించారని, 25 మంది గేట్ ర్యాంకులను పొందారని పేర్కొన్నారు. 2020–24 బ్యాచ్లో ఓవర్ఆల్ టాపర్గా నిలిచిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని పద్మజకు వైస్ ఛాన్సలర్ గోల్డ్ మెడల్ అందజేశారు. విభాగాల వారిగా ఇద్దరు టాపర్ విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ త్యాగరాజన్, హెచ్.ఓ.డీలు, అధ్యాపకులు, నాన్-టీచింగ్ సిబ్బంది, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
వేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పాటలు, నృత్యాలు, స్కిట్స్ ద్వారా కళాశాలలో ఉత్సవ వాతావరణం నెలకొల్పారు.


