జానం న్యూస్, నిమ్మనపల్లి, నవంబర్ 18: అన్నమయ్య జిల్లా, నిమ్మనపల్లి మండలంలోని బండ్లపై, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నందు శనివారం ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా ప్రభుత్వం సరఫరా చేసిన వంట పాత్రలను పాఠశాల వంట సిబ్బందికి అందజేయడం జరిగింది.పై కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్థానిక సర్పంచ్ చంద్రమోహన్, ఉప సర్పంచ్ నాగార్జున చేతుల మీదుగా వంట పాత్రలను పాఠశాల వంట సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పేద విద్యార్థులకు వరం లాంటిదని విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నారని అన్నారు.
మండల విద్యాశాఖ అధికారి-2 కే.నారాయణ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల, గ్రామస్తుల, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. ఉపాధ్యాయులు స్వేచ్ఛ వాతావరణంలో విద్యార్థులకు బోధించేందుకు గ్రామస్తులు సహకరించాలని అన్నారు. అలాగే పాఠశాల అభివృద్ధి కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులతో తత్సంబంధాలు నెల కొల్పుకోవాలని అన్నారు. ప్రభుత్వ లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని అన్నారు. కాబట్టి విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.
పాఠశాల ప్రదానోపాధ్యాయులు విశ్వనాథ నాయక్ మాట్లాడుతూ ప్రతిరోజు నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ‘నాడు-నేడు’ పనులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలను మించి ఉన్నాయని అన్నారు. అహ్లాదకరమైన వాతావరణంలో అత్యుత్తమ బోధనా సిబ్బందితో గల తమ పాఠశాలలో పిల్లలను చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని తల్లిదండ్రులను కోరారు. పై కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రతాపరెడ్డి, బి.ఎస్ రాంబాబు(హిందీ పండిట్), కృష్ణారెడ్డి ,గురుమూర్తి, శోభారాణి, విద్యార్థులు పాల్గొన్నారు.


