పీలేరు, ఏప్రిల్ 23( జానం న్యూస్):
అన్నమయ్య జిల్లా, పీలేరు పట్టణం, అయ్యప్ప రెడ్డి కాలని లో ఉన్న జడ్పీ బాలికోన్నత పాఠశాల ఈ సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అద్భుత విజయాన్ని సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ఈ పాఠశాల 64 మంది విద్యార్థినులలో 59 మంది ఉత్తీర్ణత సాధించడం విశేషం. 92 శాతం ఉత్తీర్ణతతో గత పాఠశాల రికార్డులను బద్దలుకొట్టిన ఈ ఫలితం పాఠశాల చరిత్రలో మైలురాయిగా నిలిచింది. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతం 81.14% కాగా, అన్నమయ్య జిల్లా ఉత్తీర్ణత శాతం 77.61% మాత్రమే అయ్యప్ప రెడ్డి కాలనీ జడ్పీ బాలికోన్నత పాఠశాల 92.11% ఉత్తీర్ణత సాధించి రికార్డులను బద్దలు కొట్టింది.
విద్యార్థినుల్లో పీ.నిహారిక 600 మార్కుల్లో 568 సాధించి మొదటి స్థానంలో నిలవగా, టి.దివ్య తేజశ్రీ 558 మార్కులతో రెండవ స్థానం, డి.లిఖిత 557 మార్కులతో మూడవ స్థానాన్ని పొందారు. మొత్తంగా 15 మంది విద్యార్థినులు 500 మార్కులకు పైగా సాధించడం గర్వకారణం.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఫౌజియా బేగం మాట్లాడుతూ –
“ఇది మా పాఠశాల చరిత్రలో ఒక వినూత్న మైలురాయి. విద్యార్థినుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల ప్రోత్సాహం కలసి ఈ ఘనత సాధ్యమైంది. తెల్లవారి, సాయంత్రం, ప్రత్యేక క్లాసులలో నిరంతరం బోధన చేపట్టాం.” అని చెప్పారు.
ఈ విజయోత్సవ సమావేశంలో సహాయ ఉపాధ్యాయులు వై.విజయ కుమారి, జానం సుజాత పాల్గొన్నారు. వారు విద్యార్థినుల నిరంతర ప్రయత్నాన్ని అభినందిస్తూ, ఇదే ఉత్సాహంతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

