జానం న్యూస్, పీలేరు, డిసెంబర్ 2:వచ్చే ఏడాది జనవరి 22వ తేది హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరామచంద్రుని భవ్యమైన మందిర నిర్మాణం అయోధ్యలో పూర్తి చేసుకొని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న శుభ గడియలు పురస్కరించుకొని గ్రామ గ్రామాన ధార్మిక చైతన్యం కల్పించి హిందూ సమాజంలో విశ్వాసం నింపడానికి హిందూ ధార్మిక సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా శనివారం సమరసత సేవా ఫౌండేషన్ – ఆంద్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా, పీలేరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉదయం 12.00 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు “హిందూ ధార్మిక సమ్మేళనం” జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బి.కొత్తకోట, బండెన్న స్వామి పీఠాధిపతి శ్రీ లక్ష్మీపతి స్వామి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన వక్తగా పాల్గొన్న రాష్ట్ర ధర్మ ప్రచారకులు ముద్దు సాయిరాం మాట్లాడుతూ మన సనాతన ధర్మాన్ని రక్షనే ద్వేయంగా సమరసత ఫౌండేషన్ పనిచేస్తుందని అన్నారు.గ్రామ గ్రామాన దేవాలయం కేంద్రంగా హిందూ ధర్మప్రచారం చేస్తూ ప్రజలలో ధార్మిక, సామాజిక, చైతన్యం కలిగిస్తూ హిందూ ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి హిందువు పైన ఉందని అన్నారు.కార్యక్రమంలో భాగంగా కోలాట, తాళ భజనలు, చేక్క భజనలను ప్రదర్శించారు. అంతకుముందు 150 మంది భజన కళాకారులతో “జై శ్రీరామ్” నినాదాలతో, భగవత్ స్మరణ తో శ్రీరాముని చిత్రపటముతో పురవీధులలో నగర సంకీర్తన జరిగింది. మధ్యాహ్నం కార్తీక మాస సామూహిక భోజన కార్యక్రమం జరిగింది.ఈ సమ్మేళనానికి విచ్చేసిన వారందరూ సాంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. పై కార్యక్రమంలో ప్రభుత్వ సంబంధాల ప్రముఖ్ చీపాటి వెంకటరమణారెడ్డి, జిల్లా కన్వీనర్ వీరబల్లి శ్రీధర్ రాజు, మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు, మండల మహిళా కన్వీనర్ రమాదేవి,



భజన బృందాలు, దేవాలయ కమిటీలు, వినాయక మండపాల నిర్వహణ బృందాలు, మాలా ధారణ గురువులు మరియు శిష్యులు, పారాయణ బృందాలు, శ్రీవారి సేవకులు, వివిధ హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.



