జానం న్యూస్, వాల్మీకిపురం, నవంబర్ 25: వాల్మీకిపురం పడమర పొలిమేర శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయస్వామి సమూహ దేవాలయంలో శని మహాత్రయోదశి సందర్భంగా శనివారం శ్రీ శనేశ్వరస్వామికి మహా తైలాభిషేకం వైభవంగా జరిగింది. షిరిడి సాయి సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఆలయంలో శాస్త్రోక్తంగా శని మహాత్మునికి విశేష పూజలు, పసుపు, కుంకుమ, చందనం, విభూది, జలం,మహా తైలాభిషేకం నిర్వహించారు. 12 అడుగులు గల శనేశ్వర స్వామికి వెండి కిరీటం, కర్ణ పత్ర , పాద కవచాలు, ప్రత్యేక పూలతో అలంకరించారు. ఏలినాటి శని, అష్టమశని, అర్ధాష్టక శని ,వక్ర శని, కంటకశని, జన్మ శని దోష నివారణ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ శనేశ్వర స్వామి, ఆంజనేయ స్వామికి తైలాభిషేకం చాలా ప్రీతికరమన్నారు. ఆలయంలో ప్రత్యేక హోమాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తీర్థ,అన్న ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ గాయత్రాత్మక మహాగణపతి యాగం, కలిశారాధన, శాంతి హోమం, అరుణ గాయత్రి హోమం తదితర పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా విద్యుత్ దీపాలంకరణ చేశారు. కార్యక్రమాల్లో వేద పండితులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, పీలేరు విరూపాక్షం కుమార శాస్త్రి స్వామి, పలువురు రుత్వికులు, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి జే.మురళీమోహన్, సభ్యులు పద్మ, వసంతమ్మ, శశికళ తదితరులు పాల్గొన్నారు.





