పీలేరు, సెప్టెంబర్ 6(జానం న్యూస్): అన్నమయ్య జిల్లా,పీలేరు పట్టణం, సుధాసుధీర్ వీధికి చెందిన రిటైర్డ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ బిఎస్ రామచంద్ర, బి.ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు బి.ఎస్ రాంబాబు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాయచోటి లయ గార్డెన్స్ హాలు లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష పి.ఎస్, రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.
బి.ఎస్ రాంబాబు ప్లస్ టు వరకు మదనపల్లి మండలం వలసపల్లి జవహర్ నవోదయ లో చదివాడు. బీకాం పట్టా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ లో చదివాడు. ప్రస్తుతం నిమ్మనపల్లి మండలం, బండ్లపై, ఎం.పి యు.పి పాఠశాల నందు స్కూల్ అసిస్టెంట్ (హిందీ)గా పనిచేస్తున్నారు.డీఎస్సీ-2008 బ్యాచ్ లో ఎంపికై ఇప్పటివరకు తను పనిచేసిన అన్ని మండలాల్లో విద్యార్థుల, తల్లిదండ్రుల, అధికారుల మన్ననలు అందుకున్నారు. ప్రస్తుతం తను చేస్తున్న ఎం.పి యు.పి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో .తిరిగి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచి, పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత బి.ఎస్ రాంబాబు మాట్లాడుతూ ఈ పురస్కారంతో తన బాధ్యత మరింత పెరిగిందని విద్యార్థులకు నాణ్యమైన విలువలతో కూడిన విద్యనందించి వారి పురోగతికి తన శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. అలాగే తమ పాఠశాల విద్యార్థుల సంఖ్యను కూడా పెంచేందుకు కృషి చేస్తానని అన్నారు.హిందీ మన జాతీయ భాష కాబట్టి మన మాతృభాష తోపాటు హిందీ కి కూడా విద్యార్థులు ప్రాధాన్యత ఇస్తే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు.
ఈ రోజుల్లో చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు.ఇలాంటి తరుణంలో బి.ఎస్ రాంబాబు తన ఇద్దరు కుమారులను ప్రభుత్వ పాఠశాల అయిన నిమ్మనపల్లే మండలంలోని రెడ్డివారిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో చదివిస్తూ ఇతర ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారు.

