పీలేరు, ఆగస్టు 22(జానం న్యూస్): జానపద కళలను పరిరక్షించుకుందామని పీలేరులో ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా సామాజికవేత్తలు పిలుపు నిచ్చారు. స్థానిక మదనపల్లి రోడ్డు లోని సహకార పాల శీతల కేంద్ర ఆవరణలో మంగళవారం ఉదయం ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మాట నుంచి పాట ఉద్భవిస్తే పాటకు సంగీతం జతకలిసి కళగా రూపాంతరం చెందింది. మన ముందు తరాలవి శ్రమైక జీవనం.కష్టజీవులే ఎక్కువ మంది. రోజంతా కాయకష్టం చేసి ఇళ్లకు చేరిన వారి అలసట తీర్చి వారికి సాంత్వన చేకూర్చే కళా రూపాలే జనపదాలు. జానపదాలకు పల్లెలే పుట్టిల్లు.
పల్లెపడుచులు లయ బద్ధంగా పాడుకునే పాటలు శ్రావ్యంగా ఉండి మనోల్లాసాన్ని కలిగిస్తాయి. _బుర్రకథలు ,ఒగ్గు కథలు, హరికథలు ,వీధి నాటకాలు,తోలుబొమ్మలాటలు,చెక్క భజనలు ,పండరి భజనలు, గొబ్బి పాటలు,కోలాటాలు మొదలగు జానపదాలు ఆనాటి పల్లె ప్రజల జీవన విధానంలోని ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు నుండి పుట్టినవే జానపదాలు_ అన్నారు.
ఈ జానపదకళలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందని పిలుపునిచ్చారు. అనంతరం మహిళలు జానపద గేయాలు పాడారు, అలాగే జానపద గేయాలకు నృత్యం చేశారు.
పై కార్యక్రమంలో సామాజికవేత్త మరియు పాత్రికేయుడు జానం గంగిరెడ్డి, సామాజిక వేత్త మరియు సీనియర్ అడ్వకేట్ డాక్టర్ రాయల సుధాకర్ రాయలు, ఆల్ ది బెస్ట్ ఖాదర్ బాషా, వి.ఎస్.ఎన్ సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత్రి వడ్లమూరి మాధవి, లిటిల్ ఫ్లవర్ కరస్పాండెంట్ రమాదేవి, పగడాల శోభారాణి, సచివాలయ సంక్షేమ సహాయకులు మరియు కవి వినాయకం ప్రకాష్, ఎం.దివ్య తదితరులు పాల్గొన్నారు.

