పీలేరు ఆగస్టు 14(జానం న్యూస్): సోమవారం స్థానిక సర్పంచ్ డాక్టర్ షేక్ హబిబ్ బాషా ఆధ్వర్యంలో ముందస్తు స్వాతంత్ర దినోత్సవ సమైక్య సంబరాలు జరిగాయి. అందులో భాగంగా పంచాయితీ కార్యాలయం ముందు అతిపెద్ద జాతీయ జెండాతో ర్యాలీని డీఎస్పీ మహబూబ్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు పట్టణంలో అన్ని మతాలు, కులాలు, వర్గాలు, ఏకమై సంఘటితంగా ముక్తకంఠంతో తామంతా ఒకటేనని 77వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ముందస్తుగా జరుపుకుంటున్నందుకు అభినందించారు. అలాగే ఇలాంటి కార్యక్రమం అన్నమయ్య జిల్లాలోనే జరగడం ప్రథమమని అన్నారు.
మాజీ శాసనసభ్యులు జివి శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల త్యాగపలితమే మనకు స్వాతంత్రం వచ్చిందని అన్నారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశం అవతరించిందిని అన్నారు. భారతదేశంలో పౌరులకు ఉన్నంత స్వేచ్ఛ మరే దేశంలో లేదని గుర్తు చేశారు. ఇదే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కలుషితం చెయ్యకుండా బావి తరాలకు అందించాలని పిలుపునిచ్చారు.
పీలేరు సర్పంచ్ డాక్టర్ షేక్ హబిబ్ బాషా మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పంచాయతీ కార్యాలయం ముందు అతిపెద్ద గాంధీ చిత్రపటాన్ని పెట్టడం జరిగిందని, అలాగే సుమారు నూరు అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పీలేరు అభివృద్ధితోపాటు పీలేరు ప్రజలు సుఖశాంతులతో ఎలాంటి మౌలిక సదుపాయాల సమస్యలు లేకుండా ఉండడమే తన ద్వేయమని, లక్ష్యమని అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా పీలేరు పట్టణం మతసామరస్యానికి ప్రతీక అని కితాబిచ్చారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ముందస్తు సంబరాల్లో భాగంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, అన్ని కులాలు, మతాలు, వర్గాలతో కలిసి అతిపెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నందుకు తనకు గర్వంగా ఉందని అన్నారు.
పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రెడ్డి, మాట్లాడుతూ పీలేరు పట్టణంలో జిల్లా స్థాయిలో ముందస్తు స్వాతంత్ర సంబరాలు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం మరియు వారి బలిదానాల వల్ల మనం ఈరోజు స్వేచ్ఛగా, స్వాతంత్రం అనే నీడలో హాయిగా పయనిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్క భారత పౌరుడు దేశభక్తితో స్వాతంత్రం సమరయోధులను గుర్తుచేసుకొనుట కర్తవ్యం అని అన్నారు.
తాసిల్దార్ ధనుంజయులు మాట్లాడుతూ యువకులైన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రెడ్డి, సర్పంచ్ డాక్టర్ షేక్ హబిబ్ బాషా ఎంతో ఉత్సాహంతో ఇలాంటి మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేశారు.
అనంతరం అతిపెద్ద పొడవు గల జాతీయ జెండాతో విద్యార్థులు “హర్ ఘర్ కా తిరంగా” ర్యాలీ జరిపారు. పై ఊరేగింపు పంచాయితీ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండు మీదుగా స్థానిక పట్టణంలోనే నాలుగు రోడ్ల కూడలి చేరి అక్కడ మానవహారం వేశారు. అనంతరం ర్యాలీ తిరిగి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగి అక్కడ ముగిసింది.
పై కార్యక్రమంలో డి.ఎస్.పి మహబూబ్ బాషా, పీలేరు అర్బన్ సీఐ ఎన్.మోహన్ రెడ్డి తోపాటు ఎంపీడీవో రవీంద్రారెడ్డి, ఈవో రెడ్డి ప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా టూరిజం కౌన్సిల్ సభ్యుడు షేక్ షాకీర్, షబ్బీర్, వైయస్సార్సీపి విద్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శి సుంకర చక్రధర్@చక్రి, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి మహిళా అధ్యక్షురాలు మహిత, కర్పోరేషన్ డైరెక్టర్ నాగరాజమ్మ, కాకులారం భాస్కర్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ నాయకుడు శశిధర్ రెడ్డి, విద్యార్థి నాయకుడు మలతోటి నరేష్, పంచాయతీ వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్మికులు, విద్యార్థినీ విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కులమత రహితంగా అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు

