చిత్తూరు, ఫిబ్రవరి 22(జానం న్యూస్): బాల్య వివాహాల నిర్మూలనకు సమాజం మొత్తం కలిసికట్టుగా ముందుకు రావాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం మరియు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంయుక్తంగా చేపట్టిన 100 రోజుల ప్రచార కార్యక్రమాల భాగంగా, బాల్యవివాహ రహిత భారతదేశం లక్ష్యంగా ‘రియల్’ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న ‘బాల్య వివాహ విముక్తి వ్రతం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు అధికంగా ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ప్రతి గ్రామాన్ని పర్యటించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జెండా ఊపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాల్యవివాహాల నిర్మూలనలో ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్, ‘రియల్’ సంస్థ సీఈఓ రామారావు, ప్రాజెక్టు మేనేజర్ మరియు జిల్లా కోఆర్డినేటర్ హనీషా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ రక్షణాధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ‘రియల్’ సంస్థ సీఈఓ రామారావు మాట్లాడుతూ, బాల్యవివాహాల నిర్మూలన కేవలం చట్టపరమైన చర్యలతో సాధ్యం కాదని, ప్రజల్లో అవగాహనతో పాటు సామాజిక చైతన్యం పెంపొందితేనే స్థిరమైన పరిష్కారం సాధ్యమవుతుందని అన్నారు. బాల్యవివాహాలు అధికంగా నమోదవుతున్న గ్రామాలను గుర్తించి కాలపరిమితి గల సుదీర్ఘ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
‘విముక్తి రథం’ ద్వారా పిల్లలు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలతో నేరుగా సమావేశాలు నిర్వహిస్తూ బాల్యవివాహాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ మరియు జిల్లా కోఆర్డినేటర్ హనీషా, సరిత, స్వాతి, శశికుమార్, కమ్యూనిటీ సోషల్ వర్కర్స్ గాయత్రి, రాణి తదితరులు పాల్గొన్నారు.

