కలికిరి, ఫిబ్రవరి 22(జానం న్యూస్):
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతిని పురస్కరించుకుని కలికిరి పట్టణం, ధరణి హోటల్ ఆవరణలో ‘రెడ్డి సంక్షేమ సంఘం’ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ‘రెడ్డి సంక్షేమ సంఘం’ అధ్యక్షుడు పులి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, నరసింహారెడ్డి 1847లో ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించి ప్రాణాలర్పించిన వీరుడు అని కొనియాడారు.

రాయలసీమలో పాలెగాళ్ళుగా గుర్తింపు పొందిన నరసింహారెడ్డి, 66 గ్రామాల నొస్సం సంస్థాన పాలెగానిగా ఉన్నారు. ఈస్టిండియా కంపెనీ భరణం నిలిపివేయడంతో, 1846లో కోయిలకుంట్ల తహసీల్దారిపై దాడి చేసి అతనిని హతమార్చారు. పోలీసులు తీవ్రంగా గాలించి, చివరకు 1846 అక్టోబర్ 6న నరసింహారెడ్డిని పట్టుకొని, 1847 ఫిబ్రవరి 22న బహిరంగంగా ఉరి తీశారు.
ఈ సందర్భంగా సంఘం సభ్యులు నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, త్వరలో కలికిరిలో నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ తెలుగు భాషా అదికార ప్రతినిధి, వెంకటేశ్వర యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు కవి రచయిత డా: వేంపల్లి అబ్దుల్ ఖాదర్, విశ్రాంత ఉపాధ్యాయులు రామకృష్ణా రెడ్డి, కాటా పురుషోత్తం రెడ్డి, ఎర్రబల్లి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి,
అమర నాథ రెడ్డి, విశ్రాంత ఆర్.టి.సి కంట్రోలర్ వెంకట రమణా రెడ్డి, కొమ్మేపల్లి రాజారెడ్డి, గిరినాథ రెడ్డి, చింతల వేణుగోపాల్ రెడ్డి,రంజిత్ కుమార్ రెడ్డి, బావాజీ, వెంకీ, ప్రభాస్ కుమార్, డి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.

