వాల్మీకిపురం, ఫిబ్రవరి 18(జానం న్యూస్ ):
వాల్మీకిపురం పట్టణంలో మొట్టమొదటి శాశ్వత సినిమా థియేటర్ ‘సీతారాం టాకీస్’ వ్యవస్థాపకుడు, సామాజికవేత్త దివంగత మొర్రంరెడ్డి కుమార్ రెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, నల్ల వీర గంగమ్మ దేవస్థానం ధర్మకర్త మొర్రంరెడ్డి రాంకుమార్ రెడ్డి బుధవారం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కుమార్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి, ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సేవా స్ఫూర్తిని స్మరించుకున్నారు. అనంతరం ‘శ్రీ సాయి నారాయణ నిత్య అన్నదాన ట్రస్ట్’ ఆధ్వర్యంలో 250 మందికి, స్థానిక వృద్ధాశ్రమంలో 50 మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొని తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దివంగత మొర్రంరెడ్డి కుమార్ రెడ్డి సమాజానికి చేసిన సేవలను, ఆయన ఆదర్శాలను ప్రశంసించారు. ముఖ్యంగా, నిరుపేదలకు ఉపాధి కల్పించాలనే ఆయన నిబద్ధత, వారికి సహాయం చేయాలనే తపన నేటి తరానికి మార్గదర్శకమని కొనియాడారు.
కుమార్ రెడ్డి స్థాపించిన సీతారాం టాకీస్ వాల్మీకిపురం పట్టణ ప్రజలకు వినోదాన్ని అందించడమే కాకుండా, అనేక మందికి ఉపాధి అవకాశాలను కల్పించింది. ఈ థియేటర్ నిర్మాణ సమయంలో పనిచేసిన కార్మికులకు ప్రత్యేక గౌరవంగా ఉచితంగా సినిమాలు వీక్షించే అవకాశం కల్పించడం ఆయన ఔదార్యానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ‘మానవత’ చైర్మన్ జామకాయల కృష్ణమూర్తి, సీనియర్ నాయకుడు చింతల ఆనంద రెడ్డి, తబ్జుల్ ఆనంద శెట్టి, మోహన్ జ్యువెలర్స్ అధినేత మోహన్, కోసూరి రమేష్, నల్ల వీర గంగమ్మ దేవస్థానం సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మొర్రంరెడ్డి రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ,
“నా తండ్రి దివంగత కుమార్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. పేదలకు సహాయం చేయడం ఆయన లక్ష్యం. అలాంటి మహానుభావుడికి కుమారుడిగా పుట్టడం నా అదృష్టం,” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.

